డబ్బు, పలుకుబడి,రాజకీయ అండ… చిత్రసీమలో క్యాస్ట్‌ కౌచింగ్‌పై గాయని చిన్మయి

మళయాల చిత్రసీమలో క్యాస్ట్‌ కౌచింగ్‌పై జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ పై గాయని చిన్మయి తొలిసారి స్పందించారు. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించారు. వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని చిన్మయి తెలిపారు. రాజకీయ బలం, డబ్బు వల్ల ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని శిక్షించడం కష్టంగా మారిందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అభిప్రాయపడ్డారు. వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ వల్లే ఇది సాధ్యమైంది.

ఇప్పటివరకూ ఇలాంటిది ఏ పరిశ్రమలోనూ జరగలేదు. ప్రతీ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయనేది బహిరంగ రహస్యం. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు సాధారణమని అందరూ భావిస్తుంటారు. ఇలాంటి ఘటన జరిగిందని చెప్పినా నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడం లేదు. కొన్నేళ్లపాటు కేసు నడుస్తూనే ఉంటుంది. అధికారం, రాజకీయ బలం, డబ్బు వల్ల వారిని శిక్షించడం కష్టతరంగా మారిందని చిన్మయి తెలిపారు.

అనంతరం ఆమె తనకు ఎదురైన పరిస్థితులు గుర్తు చేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. అతడి గురించి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడినందుకు తనకు ఆ పరిశ్రమలో వర్క్‌ లేకుండా చేశాడని చెప్పారు. కోలీవుడ్‌లో వచ్చిన ఎన్నో చిత్రాల్లో మనసుని హత్తుకునే పాటలు పాడి గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు చిన్మయి.

విదేశాల్లో ప్రోగ్రామ్‌ కోసం వెళ్లినప్పుడు గీత రచయిత వైరాముత్తు తనని వేధింపులకు గురి చేశాడని, ఆయన మంచివాడు కాదని విూటూ వేదికగా ఆమె షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అతడు చెప్పిన మాటలు విననందుకు తన కెరీర్‌పైనే దెబ్బ కొట్టాడని ఆమె గతంలో ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమ చిన్మయిని బ్యాన్‌ చేసింది. దాదాపు ఐదేళ్ల బ్యాన్‌ తర్వాత ఆమె ఇటీవల ‘లియో’లో త్రిష పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. దీనిపై ఆనందం వ్యక్తంచేశారు. మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు చెబుతూ పోస్ట్‌ పెట్టారు.