జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టుతో ప్రకంపనలు.. నివేదికతో ఖంగుతిన్న నేచురల్‌ స్టార్‌ నాని

మలయాళ చిత్ర పరిశ్రమపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే! అందులో వెల్లడైన విషయాలతో యావత్తు చిత్ర పరిశ్రమ అవాక్కైంది. తాజా దీనిని ఉద్దేశించి నేచురల్‌ స్టార్‌ నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నివేదికలో విషయాలు తెలుసుకుని ఎంతో బాధపడినట్లు వెల్లడించారు. ‘హేమ కమిటీ ఇచ్చిన నివేదికలో విషయాలు తెలుసుకుని షాక్‌ అయ్యాను. నా హృదయం ముక్కలైంది. నా సెట్స్‌లో లేదా చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. మెయిన్‌ స్ట్రీమ్‌ మూవీస్‌కు సంబంధించి ఇలాంటివి జరగవని నేను అనుకుంటున్నా.

భారీ చిత్రాలను తెరకెక్కించడం కోసం ప్రతి ఒక్కరూ శ్రమిస్తుంటారు. నా చుట్టూ ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండి ఉండొచ్చు. అందుకే నా లొకేషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఎప్పుడూ నా దృష్టికి రాలేదు. కాబట్టి, ఈ నివేదిక గురించి చదివినప్పుడు.. ’ఇలా ఎక్కడ జరుగుతుంది’ అని షాకయ్యా. సినీ రంగంలో రాణించాలని, తమ కలలు నెరవేర్చుకోవాలని ఆసక్తితో చాలామంది మహిళలు ఇప్పటి రోజుల్లో పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. గతంతో పోలిస్తే ఇండస్ట్రీపై ఆసక్తి చూపించే మహిళల సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది. వారు రాణించడానికి ఇక్కడ అనువైన పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ సిద్థం చేసిన విషయం తెలిసిందే. హేమ కమిటీ రూపొందించిన నివేదికలో షాకింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. ఈ నివేదిక భారతీయ చిత్ర పరిశ్రమలు అన్నింటిలోనూ చర్చకు దారితీసింది. దీంతో పలు చిత్రపరిశ్రమలకు చెందిన నటీనటులు తమ అభిప్రాయాలను ధైర్యంగా తెలియజేస్తున్నారు. కోలీవుడ్‌లోనూ కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని యువ నటి సనమ్‌శెట్టి పేర్కొన్నారు.

వేధింపులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం నివేదికల విూద నివేదికలు విడుదల చేసినంత మాత్రాన ఉపయోగం లేదని బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తా అన్నారు.

ఇదే విషయంపై మలయాళ నటుడు టొవినో థామస్కూడా మాట్లాడారు. ‘కమిటీతో నేను మాట్లాడాను. మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే ఈ కమిటీని ఏర్పాటుచేశారు. ఒకవేళ ఇదే విధమైన కమిటీని ప్రపంచవ్యాప్తంగా ఏ పరిశ్రమలో ఏర్పాటుచేసినా.. ఈ సమస్య ప్రతిచోటా ఉందనే విషయం అందరకూ తెలుస్తుంది.

ఇప్పుడు అందరూ మా చిత్ర పరిశ్రమలో ఇలా జరుగుతుందని మాట్లాడుతుంటే నేను ఈ పరిశ్రమలో వ్యక్తినే కాబట్టి నాకెంతో బాధగా ఉంది.ఇలాంటి వాటికి పాల్పడిన వారికి తప్పక శిక్ష పడాలని టోవినో అన్నారు.