21న విడుదల కానున్న ‘డంకీ ‘…. వైష్ణోదేవి ఆలయంలో షారూఖ్‌ పూజలు!

ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్‌ ఖాన్‌ సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో ‘పఠాన్‌’తో కలెక్షన్‌ కోత సృష్టిస్తే. ద్వితియార్థంలో ‘జవాన్‌’తో కలెక్షన్‌ల మోత మోగించారు. ఇప్పుడు ఏడాది చివర్లో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు ఈ బాలీవుడ్‌ బాద్‌షా.

ప్రస్తుతం షారుఖ్‌ నటించిన ‘డంకీ’ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర రిలీజ్‌కు ముందు షారుఖ్‌ ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా, ఏడాదిలో వైష్ణోదేవి ఆలయాన్ని షారుఖ్‌ సందర్శించడం ఇది మూడోసారి. జవాన్‌ చిత్రానికి ముందు గతేడాది డిసెంబర్‌లో షారుక్‌.. వైష్ణోమాతా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ‘పఠాన్‌’ రిలీజ్‌కు ముందు కూడా ఆయన ఆ ఆలయాన్ని సందర్శించారు.

ఆగస్టులో అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ రెండు చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో.. మూడోసారి ‘డంకీ’ రిలీజ్‌కు ముందు కూడా షారుఖ్‌ వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. దీంతో ఈ చిత్రం కూడా హిట్‌ అవుతుందంటూ ఫ్యాన్స్‌ చెప్పుకుంటున్నారు.