షారుక్‌ జన్మదినోత్సం రోజు ఎగబడ్డ జనం!

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ఖాన గురువారం 58వడిలోకి అడుగుపెట్టాడు. ఈయేడాది ఈ జన్మదినం షారుఖ్‌కు చాలా ప్రత్యేకం కానుంది. 2018 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు వరుస విజయాలతో మంచి జోష్‌ విూద ఉన్నారు.

ఈ యేడు ఇప్పటికే పఠాన్‌, జవాన్‌ సినిమాలు విడుదలై చెరో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాయగా ముచ్చటగా మూడో చిత్రం డన్‌కీ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమైంది. టీవీ సీరియల్స్‌ నుంచి వచ్చి బాలీవుడ్‌ను పాలించే స్థాయికి ఎదిగిన విధానం అనన్య సామాన్యం. పూట గడవని పరిస్థితి నుంచి నేడు ఒక్క సినిమాతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే రేంజ్‌కి చేరుకుని ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నటుల్లో ఒకడిగా పేరు సంపాదించాడు.

ఈ క్రమంలో ఈ రోజు (నవంబర్‌ 2) షారుఖ్‌ పుట్టిన రోజు కావడంతో అభిమానుల సందడికి హద్దే లేకుండా పోయింది. రెండు రోజుల ముందు నుంచే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు ముంబైకి చేరుకుని కనివినీ ఎరుగని హంగామా చేస్తున్నారు. నిన్న రాత్రి వేల సంఖ్యలో ఫ్యాన్స్‌ షారుఖ్‌ ఇంటికి చేరకుని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సంబురాలు చేసుకోగా ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంటి ప్రహరీపై నిలబడి అభిమానులకు అభివాదాలు చేశాడు, కృతజ్ఞతలు తెలిపారు.