దైవాంశ సంభూతుడిగా సుమన్‌ ‘త్రిష’ కు శ్రీకారం!

ఇటీవల పాటల రికార్డింగ్‌తో తన తాజా చిత్రం ‘త్రిష’ కు శ్రీకారం చుట్టినట్లుగా చెప్పుకొచ్చిన యువ దర్శకుడు ఆర్‌.కె.గాంధీ. చిత్రాన్ని కూడా ఆ వెంటనే లైన్‌లోకి తెచ్చేశారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభించినట్లుగా తాజాగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ తరువాత దేవుళ్ళ పాత్రలు పోషించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సీనియర్‌ హీరో సుమన్‌ ఈ చిత్రంలో దైవాంశ సంభూతుడిగా ప్రధానపాత్రలో నటిస్తున్నారు.

‘సంభవామి యుగే యుగే’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్‌. హైదరాబాద్‌ శివారు మియాపూర్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో సుమన్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుపుతూ మేకర్స్‌ కొన్ని ఫొటోలను విడుదల చేశారు. ఈ ఫొటోలలో హీరో సుమన్‌ని చూస్తుంటే.. ఆయన కెరీర్‌లో ఇది మరో వైవిధ్యభరిత చిత్రమనేది తెలుస్తోంది.

అలాగే దేవుని సన్నిధిలో ఓ పవర్‌ఫుల్‌ పాటని చిత్రీకరిస్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది. స్నేహాలయం క్రియేషన్స్‌` బి.ఆర్‌ మూవీస్‌ పతకాలపై రవీంద్ర బూసం ఈశ్వర్‌ నాగనాధ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కిరణ్‌ కుమార్‌ గుడిపల్లి సమర్పిస్తున్నారు. హనుమంత రాయప్ప లైన్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలో కూడా కొన్ని కీలక సన్నివేశాలను ఈ సినిమా కోసం షూట్‌ చేయనున్నారని తెలుస్తోంది.