పాట పాడిన స‌త్య‌దేవ్ : వైర‌ల్ అవుతున్న వీడియో!

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు స‌త్య‌దేవ్. న‌ట‌నకు ప్రాధాన్యమున్నవైవిధ్యమైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న అతడు అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్ర‌స్తుతం స‌త్య‌దేవ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘గాడ్సె’ ఒక‌టి. ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్’ ఫేం గోపి గ‌ణేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. అవినీతిమైన రాజ‌కీయ‌నాయ‌కుల‌ను, ఒంటి చేత్తో ఎదుర్కొన్న యువ‌కుడి పాత్ర‌లో స‌త్య‌దేవ్ న‌టించనున్నాడు.

యాక్ష‌న్ థిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం అప్‌డేట్ల‌ను స్టార్ చేసింది. తాజాగా మేక‌ర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో ‘రార‌మ్మంది.. ఊరు’ అంటు సాగే పాట‌ను జూన్ 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. స‌త్య దేవ్ ఈ పాట‌ను హ‌మ్ చేస్తూ.. ‘నేను పాడితేనే ఇంత బాగుందంటే, ఇది రామ్ మిరియాల పాడాడు. గాడ్సే సినిమా నుంచి ఈ పాట రేపు విడుద‌ల కాబోతుంది’ అంటూ వీడియోను పోస్ట్ చేశాడు.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. సి.క‌ళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో స‌త్య‌దేవ్‌కు జోడీగా మ‌ల‌యాళ కుట్టి ఐశ్వ‌ర్య హీరోయిన్‌గా న‌టించింది. నాగ‌బాబు కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ప్ర‌స్తుతం స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. దీంతో పాటుగా హిందీలో అక్ష‌య్ కుమార్ ‘రామ్‌సేతు’లో చిరంజీవి ‘గాడ్‌ఫాద‌ర్‌’లో కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నాడు.