ఆది పురుష్ ప్రమోషన్స్ కి దూరంగా లంకేష్ రావణ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో శ్రీరాముడిగా కనిపించబోతున్న సినిమా ఆది పురుష్. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. ఇక ఓం రౌత్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఆదిపురుష్ తెరకెక్కడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మూవీకి కాస్త నెగిటివ్ టాక్ తీసుకొచ్చింది. అలాగే సినిమాలో పాత్రల చిత్రణపై కూడా హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సినిమాకి ఎన్నడూ లేని స్థాయిలో నెగిటివిటీ ప్రస్తుతం ఉండటం కొంత ప్రతికూలంగా మారింది. అయితే ట్రైలర్ తో ఈ నెగిటివ్ టాక్ ని చెరిపేయాలని దర్శకుడు ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ మే నెలలో డేట్స్ ఇచ్చారు. గ్రాండ్ గా ప్రమోషన్ యాక్టివిటీస్ ని షురూ చేయనున్నారు. మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడుగా చేసిన సైఫ్ అలీ ఖాన్ దూరంగా ఉండబోతున్నారంట. వచ్చే రెండు నెలలు కుటుంబంతో కలిసి సైఫ్ వెకేషన్ కి వెలబోతున్నారు.

ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఆదిపురుష్ ప్రమోషన్స్ కి సైఫ్ అలీ ఖాన్ దూరంగా ఉండడానికి మత సంబంధమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది. తాను ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే అది వివాదం అయ్యే అవకాశం ఉందని సైఫ్ భావిస్తున్నారంట. ఒకవేళ ప్రమోషన్ లో అనుకోకుండా ఏదైనా మాట్లాడిన కాంట్రవర్సీ క్రియేట్ అయ్యి సినిమాకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందని భావించే ప్రమోషన్స్ కి దూరంగా ఉండబోతున్నారంట.

ఈ విషయం ఇప్పటికే చిత్ర యూనిట్ తో కూడా సైఫ్ అలీ ఖాన్ చర్చించడం జరిగిందనే టాక్ బి టౌన్ లో వినిపిస్తోంది. ప్రభాస్ తో పాటు కృతి సనన్, మిగిలిన లీడ్ యాక్టర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. ఒక్క సైఫ్ మాత్రమే ప్రమోషన్స్ కి దూరంగా ఉండనున్నారు.