డబ్బింగ్‌లో చెప్పి.. డైలాగ్‌ నడిపించా: ‘ఛత్రపతి’ చిత్రీకరణపై ప్రభాస్‌!

పాన్‌ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో అలరిస్తున్నారు ప్రభాస్‌. ఇటీవల ఆయన నటించిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ కటౌట్‌ను సరిగ్గా వాడుకున్న దర్శకుల్లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఒకరు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ‘బాహుబలి’ సినిమాల గురించి, ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్‌-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ చిత్రీకరణలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. బాజీరావును చంపేసిన తర్వాత ప్రభాస్‌ అతడి శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన అప్పలనాయుడు (కోట శ్రీనివాసరావు)కు వార్నింగ్‌ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తానని చెబుతాడు.

అయితే, అప్పుడు సెట్‌లో ప్రభాస్‌ డైలాగ్‌లే చెప్పలేదట. కేవలం పెదవులు మాత్రమే కదిపారట. ఇంటర్వెల్‌ షాట్‌లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఒకపక్క వర్షం. పైగా చలి. రాజమౌళి దగ్గరకు వెళ్లి ‘డార్లింగ్‌ డైలాగ్‌ గట్టిగా చెప్పలేను. సైలెంట్‌గా చెబుతాను’ అని అనడంతో జక్కన్న కూడా ఓకే అన్నారు. ఆ షాట్‌లో కేవలం పెదాలు కదిపానంతే. అక్కడున్న వాళ్లకు నేను ఏ చేస్తున్నానో అర్థం కాలేదు. షాట్‌ ఓకే అయిపోయింది. జనం ఉంటే ఎందుకో సైలెంట్‌ అయిపోతా. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చేస్తున్నప్పుడు కూడా విశ్వనాథ్‌గారు సెట్‌లో ఉండగా ఇలాగే సైలెంట్‌గా డైలాగ్‌లు చెప్పేవాడిని. ఆయన పిలిచి ‘ఇలా అయితే ఎలా? ఓపెన్‌గా డైలాగ్‌ చెప్పాలి. మరీ అంత సిగ్గుపడితే ఎలా?’ అన్నారు. నాతో పనిచేసిన దర్శకులు అందరూ రాజమౌళిని తిట్టుకుంటారు. ‘ఆయన వల్లే నువ్వు ఇలా చెబుతున్నావు’ (నవ్వులు) అని అనేవారు‘ అంటూ ప్రభాస్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్‌’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. హారర్‌, థ్రిల్లర్‌ అంశాలను మేళవించి దీన్ని తీర్చిదిద్దుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నారు. 1940 దశకంలో జరిగే కథ అని కాన్సెప్ట్‌ పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇమాన్వీ ఎస్మాయిల్‌ కథానాయిక. ఇటీవల చిత్రీకరణ మొదలైంది. దీంతో పాటు ‘కల్కి2’, ‘సలార్‌2’ చేయాల్సి ఉంది. మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ అతిథి పాత్రలో ప్రభాస్‌ మెరవనున్నారు.