అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ ఖాతాలో మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్‌.. ఆశ్చ‌ర్య‌పోతున్నటాలీవుడ్ ప్ర‌ముఖులు

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా. ఈయ‌న త‌న రెండో సినిమాతోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ జంట‌గా అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక కొద్ది రోజులుగా సందీప్ రెడ్డి త‌న మూడో చిత్రాన్ని మ‌హేష్‌తో చేయ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌ర‌గిన‌ప్ప‌టికీ, అందులో నిజం లేద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం త‌న మూడో సినిమాని హిందీలో చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తీసిన సందీప్ రెడ్డికి తెలుగు హీరోల నుండి పిలుపే క‌రువైంది. ఈ సినిమా విజ‌యం త‌ర్వాత సందీప్ రెడ్డికి వరుస ఆఫర్స్ రావ‌డం ఖాయ‌మ‌ని అంతా అనుకున్నారు. కాని ఏ హీరో కూడా సందీప్‌తో సినిమా చేసేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. రెండో సినిమాని షాహిద్ క‌పూర్‌తో చేసిన సందీప్ వంగా మూడో సినిమాని ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. రీసెంట్‌గా సందీప్ వంగా బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌భీర్ క‌పూర్‌, నిర్మాత‌ల‌ను క‌లిసి మాట్లాడాడ‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంద‌ని స‌మాచారం.

ర‌ణ్‌భీర్ తో చేయ‌నున్న సినిమాకు సందీప్ రెడ్డి వంగా డెవిల్ అనే టైటిల్‌ని పెట్టాల‌ని అనుకున్నాడ‌ట‌. కాని స‌ల్మాన్ .. కిక్ సీక్వెల్ కోసం డెవిల్ అనే టైటిల్‌పై దృష్టి పెట్ట‌డంతో సందీప్ రెడ్డి వంగా త‌న సినిమా పేరుని యానిమ‌ల్‌గా మార్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి క్లారిటీ రానున్న‌ట్టు తెలుస్తుండగా, ఇందులో క‌థానాయిక‌గా ఎవరిని ఎంపిక చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.