22 నుంచి ఓటిటిలోకి ‘కల్కి’

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం’కల్కి 2898 ఏడీ’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి అధికారికంగా ఓ ప్రకటన వెలువడింది. . ఆగస్టు 22 నుంచి దీని హిందీ వెర్షన్‌ నెట్‌ప్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది.

ఇక ఇదే తేదీ నుంచి తెలుగు, తమిళంతో సహా మిగతా భాషల్లోనూ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి రానుంది. కథేంటంటే: కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ, అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గంలాంటి కాంప్లెక్స్‌ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్‌ (కమల్‌హాసన్‌). కాశీలో బౌంటీ ఫైటర్‌ అయిన భైరవ (ప్రభాస్‌) యూనిట్స్‌ని సంపాదించి కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు.

సుప్రీం యాస్కిన్‌ తలపెట్టిన ప్రాజెక్ట్‌ కె కోసం, కాంప్లెక్స్‌ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్‌`కె కోసం గర్భవతుల్ని చేసి, వారి నుంచి సీరమ్‌ సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతుంటారు. అలా సుమతి (దీపికా పదుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది.

మరోవైపు రేపటి కోసం అంటూ శంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్‌ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వత్థామకీ, భైరవకీ సంబంధం ఏమిటి?సుప్రీం యాస్కిన్‌ ప్రాజెక్ట్‌ ` కె లక్ష్యమేమిటి?అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!