‘స్పిరిట్‌’.. ఓ సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ కథ!

‘యానిమల్‌’ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ప్రభాస్‌ హీరోగా ఆయన ‘స్పిరిట్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా సందీప్‌ వంగా దీని గురించి మాట్లాడారు. ఓ బాలీవుడ్‌ సినిమా టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ‘స్పిరిట్‌’పై స్పందించారు.

”ప్రస్తుతం నేను ప్రభాస్‌తో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అందరూ అనుకుంటున్నట్లు ఇది హారర్‌ స్టోరీ కాదు. ఓ నిజాయితీ కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌ కథ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనంతరం ‘యానిమల్‌ పార్క్‌’ను రూపొందిస్తా. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్‌ మాత్రమే ఇవ్వగలను’ అని చెప్పారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు.

గతంలో నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారని హామీఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ పోలీస్‌ డ్రామాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రానుంది.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రొమాంటిక్‌ హారర్‌ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్‌ కూడా పూర్తయింది. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు ‘కల్కి 2898 ఏడీ’ లో ప్రభాస్‌ నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.