ఆర్ ఎక్స్ 100తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది పాయల్ రాజ్పుత్. ఇందు పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన పాయల్.. ఒకే ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఎంతలా అంటే ఏకంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఆమె చేతిలో పడేంతగా పాపులర్ అయింది. ఇక వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. రవితేజ, వెంకటేష్లకు జోడిగా నటించి అందర్నీ మెప్పించింది.
డిస్కోరాజా, వెంకీమామ చిత్రాలు చేయడం వల్ల పాయల్కు ఎలాంటి పేరు రాలేదు. అయినా సరే పాయల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ లాక్ డౌన్లో పాయల్ చేసిన సందడి గురించి అందరికీ తెలిసిందే. పిల్లో ఛాలెంజ్ అంటూ వేసిన డ్రెస్ ఓ రేంజ్లో వైరల్ అయింది. అయితే తాజాగా పాయల్ ఓ ప్రకటనలో పాల్గొంది. అవగాహన కోసం ప్రభుత్వం చేస్తోన్న ఈ యాడ్కు తాను డబ్బింగ్ చెబుతోంది. మొదటి సారిగా డబ్బింగ్ చెప్పడంతో ఎంతో ఆనందంగా ఉందట.
ఇక ఇదే విషయాన్ని చెబుతూ మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఇకపై సినిమాల్లో కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పదలుచుకున్నానని పేర్కొంది. అంతేగాకుండా హైదరాబాద్లోనే ఓ ఇళ్లు కొనుక్కుని ఉండాలనుకుంటున్నట్టుగా తెలిపింది. అందుకోసం సామాన్లు కొనాలని షాపులకు వెళ్తే అందరూ గుర్తు పట్టేసి సెల్ఫీల కోసం వస్తున్నారు. అందుకే అన్నీ ఆన్ లైన్లోనే కొంటున్నానని తన సంతోషాన్ని చెప్పుకొచ్చింది.