పొలిటికల్ లీడర్ తో స్టార్ హీరోయిన్ నిశ్చితార్థం

నటి పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా ఈ నెలలో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో వారు ప్రేమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ జంట మే 13న న్యూఢిల్లీలో ఉంగరాలు మార్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టాక్ ప్రకారం, పరిణీతి మరియు రాఘవ ఇప్పటికే కొన్ని నెలల క్రితం వారి రోకా వేడుకను జరుపుకున్నారట. అయితే, వారు ఇప్పుడు ఇంకా పెళ్లి హడావిడిలో లేరు. ప్రస్తుతం వారి సంబంధిత వర్క్ కమిట్‌మెంట్‌లను నెరవేర్చడంలో బిజీగా ఉన్నారు. ఆ పనుల తరువాత పెళ్లి హడావుడి స్టార్ట్ కానుందట. గతంలోనే పరిణీతి రాఘవ్ ముంబై రెస్టారెంట్‌లో కలిసి ఉండడంతో అప్పటి నుంచీ డేటింగ్ పుకార్లకు రూటు మొదలైంది.

ఆ తరువాత మరో లంచ్ డేట్‌లో కనిపించింది ఈ జంట. అప్పటి నుండి వారు బహిరంగంగా కనిపించడం స్టార్ట్ చేశారు. పరిణీతి ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో కూడా కనిపించింది. వివాహనికి సంబంధించిన ప్లాన్స్ కోసం మీటింగ్ జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఊహాగానాలు ఎన్ని ఉన్నప్పటికీ, పరిణీతి రాఘవ్ తమ నిశ్చితార్థం లేదా వివాహ ప్రణాళికలపై ఎక్కడ వ్యాఖ్యానించలేదు.

బాలీవుడ్ మీడియా గతంలో పుకార్ల గురించి అడిగినప్పుడు పాగల్ హోగయే హై సబ్ అంటూ ఏమి తెలియనట్లుగానే ఆమె బదులిచ్చారు. ఇక ఈ విషయంలో మరికొన్ని రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. పరిణీతి ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో చమ్కిలాలో అనే సినిమా చేస్తోంది, ఇందులో ఆమె దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి నటిస్తోంది.