చలనచిత్ర అవార్డులు.. విజేతలకు సినీ ప్రముఖుల అభినందనలు

70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ’ఆట్టమ్‌’ను వరించగా.. ఉత్తమ నటుడి పురస్కారం ’కాంతార’ సినిమాకుగాను రిషబ్‌ శెట్టికి దక్కింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్యవిూనన్‌ (ఔతిబిఠాజీ ఓ।నినీని) (తిరుచిట్రంబళం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌)ను జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది. 2022 డిసెంబర్‌ 31 నాటికి సెన్సార్‌ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డుల జాబితాను ప్రకటించారు. ఇక అవార్డులు వచ్చిన వారికి స్టార్స్‌ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, నిర్మాత సూర్యదేవర నాగవంశీ వంటి వారంతా విజేతలకు అభినందనలు తెలిపారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో తెలుగు నుంచి కార్తికేయ ` 2 అవార్డు పొందటం సంతోషకరం. ఉత్తమ నటి నిత్యవిూనన్‌, ఉత్తమ నటుడు రిషబ్‌ శెట్టి, ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎంపికైన జానీ మాస్టర్‌కు హృదయపూర్వక అభినందనలు అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు. ఉత్తమ నటుడు రిషబ్‌శెట్టి, ఉత్తమ నటి నిత్యామేనన్‌.. ఉత్తమ చిత్రం ’ఆట్టమ్‌’, ’కార్తికేయ 2’ మేకర్స్‌కు అలాగే ఇతర పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు అంటూ చిరంజీవి తెలిపారు. రిషబ్‌శెట్టికి అభినందనలు. ’కాంతార’ చిత్రానికి ఉత్తమ నటుడి పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది. అందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నవ్యక్తివి. ’కాంతార’ చిత్రంలో నీ అభినయం గుర్తుకు వస్తే ఇప్పటికీ నాకు గూస్‌బంప్స్‌ వస్తున్నాయని ఎన్టీఆర్‌ అన్నారు.

నేషనల్‌ అవార్డ్‌ విజేతలందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యవిూనన్‌ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్‌, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు అని అల్లు అర్జున్‌ అన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.