అన్నదమ్ముల బంధాన్ని గొప్పగా చెప్పిన నాగబాబు!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ – లావణ్య త్రిపాఠి వివాహ వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మెగా బ్రదర్స్‌ చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణల ఫొటో ఒకటి నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

నాగబాబు ఈ ఫొటోను షేర్‌ చేస్తూ అన్నదమ్ముల బంధం గురించి ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘మా మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఈ ఫొటో ఓ జ్ఞాపకం మాత్రమే కాదు అంతకు మించింది. మా మధ్య ఉన్న అభిప్రాయాలు, విభేదాల కంటే లోతైన అనుబంధం చాలా ముఖ్యమైనది, బలమైనది. ప్రేమతో కూడిన ఎన్నో మధుర క్షణాలతో ఈ రిలేషన్‌ ముడిపడి ఉంది.

ఇది ఎప్పటికీ విడదీయరానిది. దీనికి నేనెంతో విలువిస్తాను’’ అంటూ నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఫొటో చూసి మెగా ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ‘పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ నెల ఒకటో తేదిన వరుణ్‌-లావణ్యల వివాహం జరిగింది. కుటుంబ సభ్యులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు హీరోలు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.