‘ఎంఎస్ ధోనీ’ లో నటించిన మరో నటుడు ఆత్మహత్య !

టీమిండియా మాజీ కెప్టెన్ , మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో ధోనీ పాత్రలో నటించిన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం రేపిన గాయం ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పుడు అదే సినిమాలో నటించిన మరో నటుడు సందీప్ నహర్ నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Bollywood actor Sandeep Nahar commits suicide

ముంబై, గోర్‌గావ్ ప్రాంతంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు అతడు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. సూసైడ్ నోట్‌ కూడా రాసిపెట్టాడు. వ్యక్తిగత సమస్యలు, భార్యతో విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. పరిస్థితులను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ విషయంలో తన భార్యను నిందించవద్దని కోరాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కారని పేర్కొన్నాడు.

ఫేస్‌బుక్‌లో అతడి పోస్టు చూసిన వెంటనే స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆత్మహత్యను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సందీప్ ఆత్మహత్యపై అతడి స్నేహితుడు బాల్జీత్ మాట్లాడుతూ.. అతడు చాలా భావోద్వేగాలు కలిగిన వ్యక్తి అని, ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడడని పేర్కొన్నాడు. నహర్ కుటుంబం ప్రస్తుతం చండీగఢ్‌లో ఉందని, అంత్యక్రియల కోసం మృతదేహాన్ని అక్కడికే తీసుకెళ్తామన్నాడు. చాలా కాలంగా అతడు ముంబైలో ఒంటరిగానే ఉంటున్నట్టు బాల్జీత్ తెలిపాడు.