ఆదిపురుష్ కోసం మంచు మనోజ్ కూడా..

ప్ర‌భాస్ నటించిన ఆది పురుష్ జూన్ 16న వ‌ర‌ల్డ్‌ వైడ్‌ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. మైథలాజిక‌ల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోంది.

కాగా తాజా విషయం ఏమిటంటే విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మంచు మనోజ్‌ భూమా మౌనిక దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. అనాథ చిన్నారులకు ఉచితంగా ఆదిపురుష్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఎలాంటి హద్దులు లేకుండా వేడుకగా జరుపుకునే సినిమా ఆదిపురుష్‌. జీవితంలో వచ్చే అరుదైన అవకాశం అని సోషల్ మీడియా ఖాతాలో రాసుకోవచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని 2500 మంది అనాథ చిన్నారులకు మైథలాజికల్ మాస్టర్ పీస్‌ రామాయణం ఆధారంగా వస్తున్న ఆదిపురుష్‌ చిత్రాన్ని జూన్‌ 16న చూపించాలని నిర్ణయించామని తెలిపిన మనోజ్… బృహస్పతి టెక్‌, నమస్తే వరల్డ్‌ తో కలిసి ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నట్టు తెలియజేశాడు. మంచు మనోజ్‌-మౌనిక దంపతుల గొప్ప మనసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా టికెట్లను పలువురు ప్రముఖులు సైతం కొన్నారు. కార్తికేయ ప్రోడ్యూసర్ అభిషేక్ ఆగర్వాల్ కూడా ఈ సినిమాకు 10వేల టికెట్లను డోనేట్ చేశారు. ఇక రామ్ చరణ్, రన్బీర్ కపూర్ వంటి ప్రముఖులు సైతం ఆది పురుష్ మూవీ కోసం టికెట్స్ డొనేట్ చేశారు.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కృతి స‌న‌న్ సీత పాత్ర పోషిస్తుండగా.. లక్ష్మణుడిగా స‌న్నీ సింగ్, రావ‌ణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. హ‌నుమంతుడి పాత్రలో దేవ్‌ద‌త్తా న‌గే న‌టిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సాచెట్‌-ప‌రంప‌ర ఆదిపురుష్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సుమారు రూ.500కోట్ల భారీ బడ్జెట్‍తో ఆదిపురుష్ రూపొందినట్టు తెలుస్తోంది. కాగా, నాన్ థియేట్రికల్ రైట్స్, దక్షిణాది రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కలిపి ఇప్పటికే ఆదిపురుష్ సినిమా నిర్మాతలకు రూ.400కోట్లపైగా రికవరీ అయ్యాయని బాలీవుడ్ వర్గాలు లెక్కలు వేశాయి. సినిమా కలెక్షన్లు రూ.వెయ్యి కోట్లు దాటుతాయని అంచనాలు ఉన్నాయి.