‘ఓజి’లో భాగస్వామ్యం కావడం అదృష్టం: ప్రియాంక అరుల్‌ మోహన్‌

ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న చిత్రం ‘ఓజీ’ ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌.. సుజీత్‌ దర్శకత్వంలో రానుంది. ఇందులో పవన్‌ సరసన ప్రియాంక అరుల్‌ మోహన్‌ కనిపించనున్నారు. తాజాగా ‘సరిపోదా శనివారం’ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ ఓజీ’ అవకాశం గురించి పంచుకున్నారు. ”ఓజీ లాంటి గొప్ప కథలో భాగం కావడం, వపన్‌ సర్‌ పక్కన నటించడం నా అదృష్టం. ఆ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.

పవన్‌ కల్యాణ్‌, నాని ఇద్దరూ క్రియేటివ్‌గా ఉంటారు. నాని సినిమాల గురించి ఎప్పుడూ కలలు కంటారు. పవన్‌ ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తుంటారు’ అని ప్రియాంక చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ ప్రజల్లోకి వెళ్లడం కోసమే సినిమాల్లోకి వచ్చారేమో అనిపిస్తుంటుందని హీరో నాని అన్నారు.

ఇక తాజాగా ‘ఓజీ’ గురించి హరీశ్‌ శంకర్‌ కూడా మాట్లాడారు. ‘ఓజీ’ టీజర్‌ చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. దానికి తమన్‌ అందించిన సంగీతం మరో స్థాయిలో ఉందని ప్రశంసించారు. ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

వీళ్లిద్దరూ ‘ఓజీ’ గురించి చెప్పడంతో ఎక్స్‌లో ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా విషయానికొస్తే.. ముంబయి-జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతోంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అర్జున్‌ దాస్‌, వెంకట్‌, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీని గ్లింప్స్‌కు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.