ఢిల్లీ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ నిరాశపరిచింది. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు పోరాడినా, చివరకు 14 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది.
ఢిల్లీ ఇన్నింగ్స్లో ఫాఫ్ డుప్లెసిస్ (62 పరుగులు, 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) గట్టిగానే పోరాడాడు. అక్షర్ పటేల్ (43 పరుగులు, 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు), విప్రాజ్ నిగమ్ (38 పరుగులు, 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) మద్దతిచ్చినా ఫలితం దక్కలేదు. కోల్కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు తీసి కీలకంగా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, రస్సెల్ చెరో వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. రఘువంశీ (44 పరుగులు, 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. రింకు సింగ్ (36), నరైన్ (27), గుర్బాజ్ (26) వేగంగా ఆడారు. చివర్లో రస్సెల్ (17 పరుగులు, 9 బంతుల్లో 2 సిక్స్లు, 1 ఫోర్) హిట్టింగ్తో స్కోరు 200 దాటింది.
దిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీసారు. దష్మంత చమీరా ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో కోల్కతా నైట్రైడర్స్ 10 మ్యాచ్లలో 4 విజయాలను నమోదు చేసుకుని ప్లేఆఫ్స్ ఆశలు బ్రతికించింది. ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి తమ ఫ్యాన్స్ను నిరాశపరిచింది.