Boyfriend Murder Case: కేరళలో ప్రియుడి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న గ్రీష్మకు నెయ్యట్టింకర కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఆమెను సహకరించిన మామకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 2022లో చోటుచేసుకున్న ఈ హత్యకు గ్రీష్మ (22) ప్లాన్ చేసినట్లు దర్యాప్తు స్పష్టతనిచ్చింది. తాను ప్రేమించిన యువకుడు శరణ్ రాజ్ (23) సంబంధం ముగించేందుకు నిరాకరించడంతో గ్రీష్మ అతడికి విషం కలిపిన ఆయుర్వేద టానిక్ తాగించి హత్య చేసింది.
కోర్టు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి గ్రీష్మ చేసిన క్రూరతను, సాక్ష్యాలను చెరిపేసేందుకు చేసిన ప్రయత్నాలను ఖండించారు. ఆమె వయస్సు దృష్ట్యా శిక్షను తగ్గించాలన్న వాదనను తిరస్కరిస్తూ, ఈ నేరం సమాజానికి తగిన శిక్ష విధించేలా ఉండాలని పేర్కొన్నారు. బాధితుడి తరఫు న్యాయవాది దీనిని అరుదైన కేసుగా పేర్కొంటూ, తీర్పు ఆదర్శప్రాయమని వ్యాఖ్యానించారు.
గతంలో, గ్రీష్మ తన ప్రియుడు శరణ్ రాజ్కు విషమిచ్చి హత్య చేసిన విషయం అందరిని కుదిపేసింది. విషంతో అతని అవయవాలు పాడవటంతో 11 రోజుల అనంతరం అతను మరణించాడు. తల్లి తండ్రులు ఒప్పించిన వివాహం కారణంగా శరణ్తో సంబంధాన్ని ముగించాలనుకున్న గ్రీష్మ, అతడు ఒప్పుకోకపోవడంతో హత్యకు పాల్పడింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన డిజిటల్, శాస్త్రీయ ఆధారాలతో నేరం రుజువైంది. గ్రీష్మపై హత్యతో పాటు, న్యాయసంహితలోని పలు సెక్షన్ల కింద నేరాలు నిరూపించబడ్డాయి. సాక్ష్యాలను నాశనం చేసినందుకు ఆమె మామ నిర్మలకుమారన్ నాయర్ కూడా దోషిగా తేలాడు. అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో అతని భార్యను విడుదల చేశారు. గ్రీష్మకు విధించిన ఉరిశిక్ష కేరళలో చర్చనీయాంశంగా మారింది.

