కేజీఎఫ్ తర్వాత పాన్-ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే సినిమాల్లో కాంతార చాప్టర్ 1 ఒకటి. అయితే ఈ సినిమాకు ఎదురయ్యే సమస్యలు మాత్రం తగ్గడంలేదు. తాజాగా కేరళలో షూటింగ్ జరుగుతుండగా జూనియర్ ఆర్టిస్టు కపిల్ నీటమునిగి ప్రాణాలు కోల్పోవడం యూనిట్లో తీవ్ర విషాదం నింపింది. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టికి ఇది గట్టి దెబ్బగా మారింది. ఈ పరిణామాలతో సినిమా షూటింగ్పై గట్టి ప్రభావం పడింది.
నిజానికి ఇది కాంతార యూనిట్ ఎదుర్కొంటున్న మొదటి సమస్య కాదు. గతేడాది బెంగళూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు కర్ణాటక అటవీశాఖ మంత్రి సొంతంగా అభ్యంతరం తెలిపి, పర్యావరణానికి హానీ కలిగిస్తున్నారంటూ కేసు నమోదయ్యింది. ఆ వ్యవహారం కోర్టుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. తర్వాత యూనిట్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై, జూనియర్ ఆర్టిస్టులు గాయపడటంతో కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది.
విపరీతమైన వాతావరణ పరిస్థితులు కూడా ఈ సినిమాకు తలనొప్పే. గాలి తుఫాను వల్ల షూటింగ్ సెట్స్ కూలిపోవడం, భారీ నష్టం కలగడం మరోసారి బ్రేక్ వేశాయి. అయినప్పటికీ రిషబ్ శెట్టి లొంగిపోకుండా దైవం పరీక్ష పెడుతుందనుకుంటూ ముందుకు సాగుతున్నాడు. హోంబాలే ఫిలిమ్స్ ఈ ప్రాజెక్ట్పై భారీ బడ్జెట్ వెయ్యడం, టెక్నికల్ గా హై రేంజ్ లో వర్క్ చేయడం ఈ సినిమాకు మరింత ఆసక్తి కల్పిస్తున్నాయి.
అక్టోబర్ 1న సినిమా రిలీజ్ అవుతుందనే లక్ష్యంతో యూనిట్ పోరాడుతోంది. కానీ ఈ సవాళ్లు చూసినవారంతా “కాంతార చాప్టర్ 2 సమయానికి వస్తుందా?” అని ప్రశ్నిస్తున్నారు. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నది కాంతారలోని కథకు ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రేక్షకులు మాత్రం కాంతార మ్యాజిక్ని మళ్లీ చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.