పాత్రకున్న ప్రాధాన్యతను బట్టే నటిస్తా.. కొన్ని సినిమాల రిజెక్షన్‌పై కంగనా రనౌత్‌

అక్షయ్‌ కుమార్‌, రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాలను తాను రిజెక్ట్‌ చేయడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. స్టార్‌ హీరో సినిమాలైనా తన పాత్ర నిడివి ఎక్కువ ఉంటేనే నటిస్తానని కంగనా రనౌత్‌ తేల్చి చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న హీరోల సినిమాల్లో నటించని కథానాయికలు ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగలేరని అనుకుంటారు. కొందరు అలా క్రియేట్‌ చేసేశారు. కానీ, నేను చాలామంది స్టార్‌ హీరోల సినిమాలను రిజెక్ట్‌ చేశాను.

బాలీవుడ్‌లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. అగశ్రేణి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే స్టార్‌డమ్‌ ఉన్న హీరోలతో కలిసి నటించాల్సిన అవసరం లేదని నిరూపించాను. ఆ సినిమాల్లో స్త్రీ పాత్రలు కేవలం కొన్ని సన్నివేశాలు, పాటలకే పరిమితం చేశారు. అలాంటి పాత్రలు అయితే కచ్చితంగా నేను చేయనని చెప్పేశా. బాలీవుడ్‌లో ఉన్న ఖాన్స్‌ అందరూ నాతో స్నేహంగా ఉంటారు. ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు.

అయినా పాత్రల నిడివి తక్కువ ఉందని వాళ్ల సినిమాలు తిరస్కరించా. నా తర్వాత ఈ రంగానికి రాబోయే మహిళలకు దిశానిర్దేశర చేయాలనుకుంటున్నా. ఇండస్టీల్రో ఏ ఖాన్‌, కపూర్‌ కుటుంబాలు మనకు విజయం తెచ్చిపెట్టవు. హీరోపై హీరోయిన్‌ సక్సెస్‌ ఆధారపడి ఉంటుందనే అపోహను వదిలేయండి‘ అని అన్నారు.

తాజాగా కంగానా నటించిన చిత్రం ఎమర్జెన్సీ పలుమార్లు వాయిదాల తర్వాత సెప్టెంబర్‌ 6న ఈ చిత్రం విడుదల కానుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో కథానాయికగానే కాకుండా దర్శకనిర్మాతగా కూడా కంగనా వ్యవహరించారు.