రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ‘కలియుగం పట్టణంలో’… విడుదలయిన ఒక్కరోజులోనే నిలుపుదల!

నాని మూవీ వర్క్స్‌, రామా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ . కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, దర్శకత్వం రమాకాంత్‌ రెడ్డి . డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న విడుదల అంటూ అధికారికంగా ప్రకటించి.. చెప్పిన తేదీకే సినిమాను విడుదల చేశారు.

రెండు తెలుగు రాష్టాల్ల్రో శుక్రవారం విడుదలై మంచి ప్రశంసలను అందుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్‌ ఆపేశారు. మళ్లీ త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. కారణం ఏంటనేది తెలియలేదు కానీ.. మేకర్సే అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో.. ఇలా ఒక్కరోజు థియేటర్లలో ప్రదర్శించబడి.. ఆపేసిన చిత్రంగా ఈ ‘కలియుగం పట్టణంలో’ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని నిలిపి వేస్తున్నామని.. మళ్లీ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇక శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకులను రంజింపజేసినట్లుగా తెలుస్తోంది. విమర్శకుల నుండి ప్రశంసలు కూడా ఈ సినిమాకి వచ్చాయి. విశ్వ కార్తికేయ నటన, ఆయుషి అందం.. నూతన దర్శకుడైనా కూడా రమాకాంత్‌ రెడ్డి రాసుకున్న కథ, సినిమాను తీసిన విధానంపై ప్రేక్షకులలో పాజిటివ్‌ స్పందన కనిపించింది. మరి మళ్లీ ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనేది తెలియాలంటే.. మేకర్స్‌ నుండి ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే…!