విజయ్‌ సరసన జాన్వీకపూర్‌.. కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం

అగ్రనటుడు విజయ్‌ సరసన బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటించనుందనే వార్త కోలీవుడ్‌లో హల్చల్‌ చేస్తుంది. ప్రస్తుతం విజయ్‌ ‘ది గోట్‌’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో విజయ్‌ తన 69 వ చిత్రంలో నటించనున్నారు. ఇందులో పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇటీవలకాలంలో జాన్వీ కపూర్‌ ఎక్కువగా ముంబై టు చెన్నై మధ్య చక్కర్లు కొడుతున్నారు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని పుణ్యస్థలాలను సందర్శిస్తోంది. అయితే, తన తల్లి శ్రీదేవి నిలదొక్కుకున్న తమిళంలో తాను ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో తన కుమార్తె కోర్కెను తీర్చేందుకు ఆమె తండ్రి, బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ముందుకు వచ్చారు. విజయ్‌ 69వ చిత్రంలో కుమార్తెకు అవకాశం ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి కారణం లేకపోలేదు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా నటించిన ‘వలిమై’, ‘తుణివు’ చిత్రాలను బోనీ కపూర్‌ నిర్మించారు. దీంతో దర్శకుడు హెచ్‌. వినోద్‌-బోనీ కపూర్‌ మధ్య మంచి సత్సంబంధాలు ఉండటంతో విజయ్‌ చిత్రంలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్‌ వినిపిస్తుంది. మరో వైపు జాన్వీ కపూర్‌ ఇప్పటికే సౌత్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర సినిమాలోనూ.. అలాగే గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ , బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోనూ ఆమె అవకాశం సొంతం చేసుకుంది. ‘దేవర’ చిత్రం రెండు పార్ట్‌లుగా రానుంది కాబట్టి.. జాన్వీలో సౌత్‌లో మూడు సినిమాలు చేస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు విజయ్‌ సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చినట్లుగానే టాక్‌ వినబడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.