ఐపీఎల్లో ఓ మ్యాచ్పై ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా ఓడిపోవడంపై అనుమానాలు మొదలయ్యాయి. గెలుపు దాదాపుగా ఖాయంగా కనిపించిన సమయంలో రాజస్థాన్ తిరగబడకపోవడంపై అభిమానులు సహా క్రికెట్ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
ఇదే అంశంపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అడ్హక్ కమిటీ కన్వీనర్ జయదీప్ బిహానీ చేసిన వ్యాఖ్యలు బాంబు లాంటి దుమారం రేపాయి. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆయన వ్యాఖ్యలపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు పూర్తిగా తప్పుడు, నిరాధారమైనవని తేల్చి చెప్పింది. బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు రాష్ట్ర సీఎం, క్రీడా శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.
రాజస్థాన్ రాయల్స్ సీనియర్ అధికారి దీప్ రాయ్ కూడా ఈ ఆరోపణలపై స్పందిస్తూ అవి పూర్తిగా అవాస్తవమని, బిహానీ చేసిన వ్యాఖ్యలు జట్టు ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నమేనని పేర్కొన్నారు. క్రికెట్ ను దెబ్బతీసేలా ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇటువంటి ఆరోపణలు బీసీసీఐ, స్పోర్ట్స్ కౌన్సిల్ వంటి సంస్థల పట్ల ప్రజల్లో అనవసర అనుమానాలు కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి అంతగా మెరుగ్గా లేదు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో కేవలం 2 విజయం సాధించగా, 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ పర్ఫార్మెన్స్ పట్ల ఇప్పటికే అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, తాజా ఫిక్సింగ్ ఆరోపణలు మరింత చర్చకు తావు కలిగించాయి. ఈ వివాదం ఏ దిశగా తిరుగుతుందో వేచి చూడాల్సిందే.