జైపూర్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఎంఐ జట్టు అన్ని విభాగాల్లో పైచేయి సాధిస్తూ రాజస్థాన్ రాయల్స్ను 100 పరుగుల తేడాతో ఓడించింది. ఈ ఘన విజయం ద్వారా ముంబయి పాయింట్ల పట్టికలో టాప్ స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు, ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లుకున్న రాజస్థాన్ సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి, ఓపెనర్లు రోహిత్ శర్మ (53), రికెల్టన్ (61) చెలరేగడంతో భారీ స్కోరు ఖాయమైంది. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యం అందించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (48 నాటౌట్), హార్దిక్ పాండ్యా (48 నాటౌట్) లు చివర్లో విరుచుకుపడ్డారు. దీంతో 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ముంబయి 217 పరుగులు చేసింది.
218 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో రాజస్థాన్ పూర్తిగా విఫలమైంది. వైభవ్ సూర్యవంశీ డకౌట్ కాగా, జైస్వాల్ (13), పరాగ్ (16), హెట్మేయర్ (0) లు వరుసగా వెనుదిరిగారు. బుమ్రా తన తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు తీసి ముంబయికి ఊపు తీసుకొచ్చాడు. స్పిన్నర్ కర్ణ్ శర్మ మూడు వికెట్లు తీసి మధ్యలో మరో దెబ్బ కొట్టాడు. టీమ్ మొత్తం 16.1 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది.
జస్ప్రీత్ బుమ్రా (2/15), కర్ణ్ శర్మ (3/23), బౌల్ట్ (3/28) ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆర్చర్ (30) తప్ప రాజస్థాన్ వైఫల్యంతో పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయింది. ఎంఐకి ఇది వరుసగా ఆరో విజయం కాగా, ఆర్ఆర్ 11 మ్యాచ్లలో ఎనిమిదో ఓటమిని చవిచూసింది. ఇక మిగిలిన మ్యాచ్లు ప్రెస్టేజ్ పరంగా మాత్రమే మిగిలినట్టైంది.