IPL 2025: ఓవర్ రేట్ తప్పిదాలతో కెప్టెన్లకు బీసీసీఐ కఠిన చర్యలు

ఐపీఎల్ 2025 సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు జట్ల కెప్టెన్లపై భారీ జరిమానాలు విధించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి రజత్ పటిదార్‌కు రూ. 24 లక్షలు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా పడింది. సీజన్‌లో మొదటిసారి నిబంధనను ఉల్లంఘించిన కమిన్స్‌కి తక్కువగా, రెండోసారి ఉల్లంఘించిన పటిదార్‌కు రెట్టింపు జరిమానా విధించబడింది.

బీసీసీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, “ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, కనీస ఓవర్ రేట్‌ను పాటించకపోవడం సీరియస్ నేరం. సన్‌రైజర్స్ జట్టు ఈ సీజన్‌లో మొదటిసారి తప్పిదం చేసినందున కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది. ఆర్‌సీబీ మాత్రం రెండోసారి నిబంధనలను ఉల్లంఘించినందున పటిదార్‌కు రూ.24 లక్షల జరిమానా విధించబడింది. ప్లేయింగ్ XIలోని మిగిలిన సభ్యులకూ ఒక్కొక్కరికి రూ.6 లక్షల జరిమానా విధించనున్నారు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం వసూలు చేయనున్నారు.”

నిన్నటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతలను జితేశ్ శర్మ చేపట్టినప్పటికీ, జరిమానా మాత్రం రెగ్యులర్ కెప్టెన్ రజత్ పటిదార్‌కే వర్తించనుంది. తాజా పరాజయంతో పాటు జరిమానా భారంతో ఆర్‌సీబీపై ఒత్తిడి మరింత పెరిగింది. సన్‌రైజర్స్ చేతిలో 42 పరుగుల తేడాతో ఓటమి పొందిన ఆర్‌సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.

18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆర్‌సీబీకి ప్రస్తుతం 17 పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ తగ్గిపోవడంతో రేసులో వెనుకబడింది. ప్లేఆఫ్స్ రేస్‌లో టాప్ 2లో ఉండాలంటే చివరి మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఆర్‌సీబీపై ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మహానాడుకు కష్టాలు || Sr.Journalist Kommineni Srinivasa Rao Reacts On Kadapa Mahanadu Event || TR