ప్ర‌భాస్‌పై భారీ న‌మ్మ‌కం పెట్టుకున్న నిర్మాత‌లు.. సెట్ కోస‌మే రూ.30 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు!

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌పై నిర్మాత‌లు భారీ పెట్టుబ‌డులు పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న సినిమాల‌న్నీ దాదాపు బాలీవుడ్ రేంజ్‌లో ఉంటున్నాయి. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న రాధే శ్యామ్ చిత్రం, మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌నున్న పీరియాడిక‌ల్ చిత్రం, బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కించ‌నున్న ఆదిపురుష్ చిత్రాలు కూడా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్నాయి.

రాధేశ్యామ్ విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం ఇటీవ‌ల ఇటలీలో మేజ‌ర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ సక్సెస్ ఫుల్‌గా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇక ఇప్పుడు హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నారు. దీని కోసం భారీ సెట్‌ని రూపొందించే ప‌నిలో ఉన్నార‌ట మేక‌ర్స్. దాదాపు 30 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో సెట్ వేస్తున్నార‌ని ఇన్‌సైడ్ టాక్. ఈ సెట్‌లోని స‌న్నివేశాలు సినిమాకి కీలకం కావ‌డంతో నిర్మాత‌లు అంత‌గా ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌.

ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం మేర‌కు క్లైమాక్స్ సీన్ షూట్ చేయ‌నున్నారని టాక్. ఏదైన ఒక్క సెట్ కోసం అంత ఖ‌ర్చు పెట్టి సినిమాలు తీస్తే నిర్మాత‌లు ఆరిపోవ‌డం ఖాయం అంటున్నారు. సాహో మాదిరిగా రాధేశ్యామ్ డివైడ్ టాక్ తెచ్చుకుంటే నిర్మాత‌లు నెత్తిన గుడ్డ వేసుకోవ‌ల‌సిందే అని కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమ‌గా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమాలో పూజా హెగ్డే న‌టిస్తుంది. ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు . యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు రూ.140కోట్ల బడ్జెట్ తో చిత్రీకరిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. ఇందులో సత్యరాజ్, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు