‘మన్మథుడు’ హీరోయిన్‌ అన్షు మళ్లీ నటిస్తానంటోంది…!

‘తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది’.. ఈ డైలాగ్‌ వినగానే ‘మన్మథుడు’ చిత్రం ఎలాగైతే గుర్తొస్తుందో అమాయకంగా ఆ డైలాగ్‌ చెప్పిన అన్షు కూడా అంతే గుర్తొస్తుంది. ‘మన్మథుడు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ ప్రభాస్‌తో ‘రాఘవేంద్ర’ చిత్రంలో నటించింది. తమిళంలో రెండు చిత్రాల్లో గెస్ట్‌ అపీయరెన్స్‌ లో కనిపించి మెప్పించింది. హీరోయిన్‌ గా నటించింది రెండు చిత్రాల్లోనే అయినా యువత మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఆ తర్వాత ఆమె ఏ సినిమాలోనూ కనిపించలేదు. సచిన్‌ సగ్గర్‌ ను పెళ్లి చేసుకుని స్థిరపడింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకొచ్చింది. తాజాగా ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సడెన్‌ గా సినిమాలు ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో కారణాలను చెప్పింది.”ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. మా పూర్వీకులు భారతీయులే. 16 ఏళ్ల వయసులో ఇండియా వచ్చాను.

అప్పుడే ‘మన్మథుడు’ సినిమాలో ఆఫర్‌ వచ్చింది, దీంతో నా కల నిజమైనట్టు అనిపించింది. అయితే సినిమాల్లో యాక్టివ్‌ కావాలనుకున్నా. కానీ చిన్న వయసు కావడంతో చదువుపై కూడా దృష్టి పెట్టాలనుకున్నా. కానీ మంచి అవకాశాలు రావడంతో సినిమాల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడంటే పీఆర్‌ టీమ్‌లు వున్నాయి. కానీ అప్పుడు నాన్నే నా వెంట ఉండేవారు. ఎక్కడికి వెళ్లాలన్నా నాన్న పర్మిషన్‌ తీసుకోవాల్సి వచ్చేది.

కథలు చెప్పడానికి ఎవరైనా వచ్చినా వాళ్లు ముందుగా నాన్ననే కలవాల్సి వచ్చేది. నేను తెలుగులో నటించిన రెండు సినిమాల్లోనూ సెకెండ్‌ హీరోయిన్‌ గానే చేశా. రెంటింటిలోనూ నా పాత్ర చనిపోతుంది. ఈ సినిమాలు చూసి మరో రెండు మూడు చిత్రాల్లో అలాంటి రోల్స్‌నే ఆఫర్‌ చేశారు. ఆ తరహా పాత్రలు చేయడం కన్నా ఖాళీగా ఉంటే బెటర్‌ అనిపించి సినిమాల్ని వదిలేశా‘ అని అన్నారు. ప్రస్తుతం తనకు నచ్చే క్యారెక్టర్‌ ఆఫర్‌ చేస్తే మళ్లీ సినిమాల్లో నటిస్తా అని ఆమె తెలిపారు.