‘మన్మధుడు’ అన్షు మళ్లీ వస్తోంది…!

నాగార్జున సరసన ‘మన్మధుడు’ సినిమాలో చేసిన అన్షు గుర్తున్నారు కదా, ఆమె చాలా సంవత్సరాల విరామం తరువాత ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఒప్పుకున్నట్టుగా తెలిసింది. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా ప్రారంభం అయిన ఈ సినిమాలో రావు రమేష్‌ కి జోడీగా అన్షు నటిస్తున్నట్టుగా తెలిసింది. దర్శకుడు నక్కిన త్రినాధరావు, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్‌, సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా ఎస్‌.కె.30 సినిమా కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రాజేష్‌ దందా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు వున్నారని తెలిసింది. ఇందులో సందీప్‌ కిషన్‌ పక్కన ఒక కథానాయిక కోసం చిత్ర నిర్వాహకులు ఒక కొత్తమ్మాయిని వెతుకుతున్నట్టుగా తెలిసింది.

అయితే ఇంకో అమ్మాయి కోసం ముందుగా ఈ చిత్ర నిర్వాహకులు ప్రియమణిని అడిగినట్టుగా తెలిసింది. అయితే ఆమె చాలా బిజీగా ఉండటం వలన ఈ సినిమా కోసం తన తేదీలు కేటాయించలేకపోతున్నట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు చిత్ర నిర్వాహకులు ‘మన్మధుడు’ లో నాగార్జున పక్కన చేసిన అన్షు కి కథ చెప్పారని, ఆమెకి కథ బాగా నచ్చి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకుందని ఒక వార్త నడుస్తోంది. అన్షు అప్పట్లో ‘మన్మధుడు’ తరువాత ‘రాఘవేంద్ర’ అనే సినిమాలో ప్రభాస్‌ పక్కన నటించింది. ఇది ప్రభాస్‌ కి రెండో సినిమా.

ఆ తరువాత అన్షు ఇంకో రెండు సినిమాలు మాత్రమే చేసి పరిశ్రమని వీడి వెళ్లిపోయారు. తరువాత పెళ్లి చేసుకొని లండన్‌ లో నివాసం వుంటున్నట్టుగా తెలిసిందే. అయితే ఈమధ్యనే మళ్ళీ భారత దేశం వచ్చి నాగార్జునని, పరిశ్రమలో చాలామందిని కలిసింది అన్షు. కొంతమందికి ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చింది. అలాగే ఆమె చేసినవి నాలుగు సినిమాలే అయినా, ఆమె ప్రేక్షకుల మదిలో ఉండిపోయింది. ఇప్పుడు చాలా విరామం తరువాత అన్షు ఈ తెలుగు సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఆమె రావు రమేష్‌ పక్కన నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. సందీప్‌ కిషన్‌ ఈ సినిమాలో కథానాయకుడు కాగా, రావు రమేష్‌ కూడా ఇంకో ప్రధాన పాత్రలో కనపడతారని తెలుస్తోంది. అన్షు పాత్ర సినిమాలో హైలైట్‌ అని, ఆమె పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.