ఆసక్తి రేకెత్తిస్తున్న ‘తంగలాన్‌’ పోరాటాలు

విక్రమ్‌ కథానాయకుడిగా పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రం ‘తంగలాన్‌’. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. మాళవిక మోహనన్‌, పార్వతీ తిరువోతు, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో బ్రిటిష్‌ పాలనలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. దీని కోసం అప్పటి వాతావరణాన్ని తలపించేలా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు పా. రంజిత్‌. దాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా పరిచయం చేశారు.

కోలార్‌ గనుల్లోని బంగారాన్ని వెలికి తీసేందుకు బ్రిటిష్‌ అధికారులు స్థానిక గిరిజనుల్ని పనిలో పెట్టుకోవడం.. అందులో ఓ గిరిజన తెగ నాయకుడిగా విక్రమ్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించడం.. బంగారాన్ని వెలికి తీసే క్రమంలో రెండు తెగల మధ్య పోరు మొదలవడం.. ఇలా ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తూ సాగిందీ ప్రచార చిత్రం.

ఇందులో విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఆఖర్లో బ్లాక్‌ పాంథర్‌తో విక్రమ్‌ చేసిన ఫైట్స్ అన్నీ అలరించాయి. ‘చావుని ఎదురించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం‘ అంటూ ట్రైలర్‌ ఆఖర్లో విక్రమ్‌ చెప్పిన డైలాగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.