Ground Zero: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా ఆవేదన రేపిన సంగతి తెలిసిందే. అమాయక పర్యాటకులపై జరిపిన దాడిలో 26 మంది మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ నేపథ్యంలో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘గ్రౌండ్ జీరో’ సినిమాపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను ఆత్మీయంగా తాకుతోంది.
బీఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ నరేంద్ర నాథ్ దూబే జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తేజస్ విజయ్ డియోస్కర్ తెరకెక్కించారు. ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యవంతుడి కథను మేధావిగా ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన పహల్గాం దాడి తర్వాత, దేశభక్తి మూడ్లో ఉన్న ప్రజలు ఈ సినిమాను మరింత ఆత్మీయంగా స్వీకరిస్తున్నారు.
ప్రేక్షకుల రెస్పాన్స్ ప్రకారం, ఫస్ట్ ఫ్రేమ్ నుంచే సినిమా గట్టి ఫీలింగ్ అందించిందట. నిజ జీవిత సంఘటనల నేపథ్యం కావడం వల్ల, ప్రేక్షకులు దేశభక్తితో ఉప్పొంగిపోతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ హష్మీ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శకులు కూడా ‘గ్రౌండ్ జీరో’ను ఒక గొప్ప ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.
అయితే కొన్ని లోపాలపై కూడా ప్రేక్షకులు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే కొంత చోట్ల లాగీగా మారిందని, ఎడిటింగ్ పరంగా త్వరితగతిన పూర్తిచేయడం స్పష్టంగా కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, కొన్ని యాక్షన్ సీన్స్లో శబ్దం మోత అధికంగా అనిపించిందని చెబుతున్నారు. అందుకే కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, దేశభక్తి భావనను ఆకట్టుకునేలా రూపొందిన ‘గ్రౌండ్ జీరో’ను తప్పకుండా చూసేయాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.