రీమేక్‌ ల తీరుపై చర్చ!

సౌత్‌లో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలను నార్త్‌లో రీమేక్‌ చేయటం అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే ఆ రీమేక్‌ చేస్తున్న తీరు మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఎమోషనల్‌ డ్రామాలుగా తెరకెక్కిన సినిమాలను హిందీలో యాక్షన్‌ సినిమాలుగా మార్చి సోల్‌ను దెబ్బ కొడుతున్నారన్న కంప్లయింట్స్‌ వినిపిస్తున్నాయి.

తాజాగా రిలీజ్‌కు రెడీ అవుతున్న మూవీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. విజయ్‌ హీరోగా తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయిన మూవీ ‘తెరి’ యాక్షన్‌ డ్రామానే అయినా ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల రిలేషన్‌, లవ్‌ స్టోరి హైలెట్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో ‘బేబీ జాన్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అంటూ ప్రమోట్‌ చేస్తున్నారు మేకర్స్‌.

కార్తీ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమాను హిందీలో ‘భోళా’ పేరుతో రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ విషయంలో కూడా యాక్షన్‌ మెయిన్‌గా హైలెట్‌ అయ్యింది. ‘భోళా’లో ఎమోషన్స్‌ కన్నా యాక్షన్‌ పార్ట్‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్‌ ఇచ్చారు మేకర్స్‌.

ఒరిజనల్‌ వర్షన్‌లో రెండు, మూడు సాలిడ్‌ యాక్షన్‌ సీన్స్‌ మాత్రమే ఉన్నాయి. మిగతా అంతా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఎమోషనల్‌ డ్రైవ్‌లా సాగుతుంది. కానీ ‘ఖైదీ’ నార్త్‌ వర్షన్‌ను పూర్తిగా మార్చేశారు మేకర్స్‌. విజువల్స్‌ పరంగా ‘భోళా’ గ్రాండ్‌గా అనిపించినా… ‘ఖైదీ’లా మనసును తాకలేదన్న కామెంట్స్‌ వినిపించాయి.

గతంలోనూ కొన్ని సౌత్‌ సినిమాలను ఇలాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌గా మార్చేశారు నార్త్‌ మేకర్స్‌. ముఖ్యంగా టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించిన సౌత్‌ రీమేక్స్‌ విషయంలో ఇలాంటి మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. సౌత్‌లో సూపర్‌ హిట్‌ అయిన వర్షం, క్షణం, తడాకా సినిమాలను హిందీలో రీమేక్‌ చేసిన టైగర్‌.. ఆ సినిమాల్లో కథ మొత్తాన్ని పక్కన పెట్టేసి యాక్షన్‌ సీన్స్‌తో నింపేశారు. ఇప్పుడు ‘బేబీ జాన్‌’ విషయంలోనూ అదే జరుగుతుండటంతో ఈ సినిమా రిజల్ట్‌ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి.