అగ్ర నటులను డైరెక్ట్‌ చేయడం సాహసమే: ‘కల్కి’ చిత్రీకరణపై నాగ్‌ అశ్విన్‌

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో తాజాగా టీమ్‌ ఓ ఆంగ్ల విూడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. అగ్ర నటీనటులతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్స్‌ నటించారు. వాళ్లను డైరెక్ట్‌ చేయడం సామాన్యమైన విషయం కాదు. నేను డైరెక్షన్‌లోకి వచ్చి తక్కువ కాలమే అవుతుంది. అమితాబ్‌ బచ్చన్‌ , కమల్‌ హాసన్‌ వంటి వారు నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. గొప్ప నటులు. వారికి సీన్స్‌ వివరించడం సిల్లీగా అనిపించింది. ఈ సినిమా కోసం తొలి సన్నివేశాన్ని అమితాబ్‌తో తీశాను. ఆయనకు ఇందులో మంచి యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకుంటూనే ఉంటారు. అది వాళ్ల గొప్పతనం. ప్రభాస్‌ , దీపికాలకు ఉన్న స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఫ్యాన్స్‌ వాళ్ల నుంచి ఏం కోరుకుంటున్నారో అలానే చూపించాను’ ’ఈ చిత్రాన్ని 12 ఏళ్ల పిల్లలు కూడా ఇష్టపడేలా తీశాను.

ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలను పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఇందులో ఎలాంటి వెహికల్స్‌ వాడాలి అనే విషయంపై ఎన్నో రోజులు ఆలోచించాను. మనుషులు మాస్క్‌లు పెట్టుకోవడం, ఆక్సిజన్‌ సిలిండర్లు ఉపయోగించడం వంటివి నిజంగా జరుగుతున్నవే’ అని చెప్పారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ ఉందా అని ప్రశ్నించగా.. దీనికి సమాధానం చెప్పకుండా మరో ప్రశ్న అడగాలని నవ్వుతూ కోరారు నాగ్‌ అశ్విన్‌.