టాలీవుడ్లో టాలెంట్ ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి టాప్ లిస్ట్లో ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ, ఆమెను ఒప్పించాలంటే మామూలు విషయం కాదు. కథ, పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆమె, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమాకు సంబంధించి వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి పేరు ప్రస్తావనలోకి వచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాలో కథకు మైథలాజికల్ టచ్ ఉండడంతో, హీరోయిన్ పాత్రకు బలమైన ఎమోషన్ అవసరం ఉందట. త్రివిక్రమ్ చాలా ఆలోచించి, ఈ రోల్కి సాయి పల్లవి కరెక్ట్ అని నిర్ణయించుకున్నట్లు టాక్. ఆమె యాక్టింగ్ టాలెంట్, నేచురల్ ఎక్స్ప్రెషన్స్ అలాంటి పాత్రకు పెర్ఫెక్ట్గా సెట్ అవుతాయనే అభిప్రాయం ఆయనకు వచ్చిందట. కానీ, సాయి పల్లవి ఈ ఆఫర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సాయి పల్లవి సినిమాలను ఎన్నుకోవడంలో చాలా సెలెక్టివ్. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ రామాయణం సినిమాలో సీతగా నటిస్తున్నా, తెలుగులో కొత్త ప్రాజెక్ట్పై క్లారిటీ లేదు.
అయితే, త్రివిక్రమ్ కథ నేరేషన్కు ఎవరినైనా ఇంప్రెస్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు. అతను కథ చెప్పిన తర్వాత, పాత్రపై మంచి క్లారిటీ ఇస్తాడు. దీంతో, ఆమెను ఒప్పించగలిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే, ఇది టాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పరచే ప్రాజెక్ట్ అవ్వడం ఖాయం. అల్లు అర్జున్, సాయి పల్లవి లాంటి స్టార్ కాంబో, త్రివిక్రమ్ దర్శకత్వం అంటే భారీ హిట్ అవ్వొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. మరి, గురూజీ తన మాటల మాంత్రికత్వంతో సాయి పల్లవిని ఒప్పించగలడా లేదా అన్నది చూడాలి.