నేపాల్ రిలీజ్ కోసం ఆ డైలాగ్స్ లేపేసారు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. భారీ బడ్జెట్ తో టి-సిరీస్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ సినిమా చాలా దేశాలలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అలాగే మన పొరుగు దేశం అయిన నేపాల్ లో కూడా ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయ్యింది.

అయితే అక్కడ రిలీజ్ కి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. సీతాదేవి జన్మస్థలం నేపాల్ అని అక్కడి ప్రజలు, ప్రభుత్వం భావిస్తోంది. అయితే సీతాదేవి జన్మస్థలం గురించి కొన్ని సంభాషణలు ఆమె ఇండియాలోనే జన్మించినట్లు రిప్రజెంట్ చేయడంతో అక్కడి సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారంట. ఆ డైలాగ్స్ ని తొలగిస్తేనే సెన్సార్ చేస్తామని చెప్పడంతో చిత్ర యూనిట్ తప్పనిసరి పరిస్థితిలో కీలకమైన ఆ సంభాషణలని తొలగించిందని తెలుస్తోంది.

ఇక అయితే నేపాల్ లో రిలీజ్ అయ్యే ప్రింట్స్ వరకే ఆ డైలాగ్స్ ని తొలగించడం జరిగిందని తెలుస్తోంది. అడ్డంకులు తొలగిపోవడంతో అక్కడ కూడా గ్రాండ్ గా మూవీ రిలీజ్ అయ్యింది. కృతి సనన్ ఈ చిత్రంలో సీతాదేవిగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రేక్షకులు అయితే సినిమాలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ ఆలీఖాన్ నటనకి బ్రహ్మరథం పడుతున్నారు.

ప్రభాస్ కెరియర్ లోనే బెస్ట్ మూవీగా ఆదిపురుష్ ఉంటుందనే టాక్ ట్విట్టర్ లో వినిపిస్తోంది. జోరుగా సినిమా చూసిన పబ్లిక్ తమ అభిప్రాయాలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆదిపురుష్ చిత్రానికి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయంట. మొదటి రోజు కలెక్షన్స్ తో కూడా ఈ చిత్రం రికార్డులు సృస్టించబోతోందని ట్రేడ్ పండితులు అంచనా.

మరి ఈ సినిమా ఏ మేరకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది అనేది మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చేయనుంది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో హిందుత్వ అభిమానులు అందరూ కూడా ఆదిపురుష్ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు.