ఐపీఎల్ 2025 సీజన్లో సోమవారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించింది. విజయం కోసం 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితిలో ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసి గెలుపొందింది. ఈ విజయంలో అషుతోష్ శర్మ (31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లు, నాటౌట్ 66) అసాధారణ ఇన్నింగ్స్ కీలకంగా మారింది.
మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు (6 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు (6 ఫోర్లు, 7 సిక్స్లు) చేసి భారీ స్కోరుకి దారితీశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసి మెరిశాడు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, విప్రజ్, ముఖేష్ తలో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభం దారుణంగా ఎదురైంది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమై 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్ 29, స్టబ్స్ 34 పరుగులు చేసినా మ్యాచ్పై గెలుపు ఆశలు తొలగినట్లే కనిపించాయి. కానీ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అషుతోష్ శర్మ అద్భుతంగా రాణించి, విప్రజ్ నిగమ్ (15 బంతుల్లో 39) తో కలిసి మ్యాచ్ను తిరగదొడిగాడు. చివర్లో అషుతోష్ సిక్సర్తో విజయాన్ని పూర్తి చేశాడు.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఆఖరి ఓవర్లో పంత్ మిస్ చేసిన స్టంప్ అవుట్. మోహిత్ శర్మను ఔట్ చేసి ఉంటే ఢిల్లీ ఆలౌట్ అయ్యేది. కానీ ఆ తప్పిదంతోనే లక్నో విజయాన్ని చేజార్చుకుంది. అషుతోష్ శర్మ మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఈ గెలుపుతో ఢిల్లీ శుభారంభం చేసుకుంది, లక్నో మాత్రం తొలి మ్యాచ్లో నిరాశలో మిగిలింది.