IPL 2025: ప్లేఆఫ్స్ కు దూరమైన డిఫెండింగ్ ఛాంపియన్‌!

ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశలన్నీ వర్షంలోనే కరిగిపోయాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాత్రి ఆర్సీబీతో తలపడాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా గల్లంతయ్యాయి. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో వర్షం అడుగుపెట్టడం ఫ్యాన్స్‌కి తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఈ మ్యాచ్ రద్దుతో కేకేఆర్‌కు కేవలం ఒక పాయింటే లభించింది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేకేఆర్ 5 విజయాలతో 12 పాయింట్లకు పరిమితమైంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దవడం కేకేఆర్‌కే ప్రత్యేకంగా నష్టం కలిగించింది. మిగిలిన ఒక మ్యాచ్‌లో గెలిచినా, వారి ఖాతాలో 14 పాయింట్లే చేరతాయి. ఇది ప్లేఆఫ్స్‌కు సరిపోదు. దీంతో నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో తమ ప్రయాణాన్ని ముగించింది.

ఇక మరోవైపు, ఆర్సీబీకి ఈ పాయింట్ కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఒక్క పాయింట్‌తోనే దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నట్లయింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ జ‌ర‌గ‌కపోయినా, ఆర్సీబీ అభిమానులు మాత్రం టైటిల్‌పై ఆశలు కొనసాగిస్తున్నారు.

గత ఏడాది ఫైనల్‌కి వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐదు టైటిల్స్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, మెగా పర్సిస్టెంట్ రాజస్తాన్ రాయల్స్‌ ఇప్పటికే లీగ్ దశలోనే వెనుదిరిగిన జట్లు. ఇప్పుడు వారి జాబితాలో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ చేరడం ఆశ్చర్యంగా మిగిలింది. ఐపీఎల్ 2025‌లో ఎన్నో అంచనాల్ని తలకిందులుగా మార్చిన వర్షం… ఇప్పుడు టైటిల్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది.