డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ ఆందోళన కలిగించే విషయం : నటి కృతి సనన్‌ వెల్లడి

ఏఐ టెక్నాలజీ, డీప్‌ ఫేక్‌ వీడియోల గురించి హీరోయిన్‌ కృతి సనన్‌ స్పందించారు. తాజాగా ఆమె నటించిన ‘తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా’ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ గురించి మాట్లాడారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. కొన్ని నెలల నుంచి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి.

అలాగే ఏఐ టెక్నాలజీ సాయంతో క్రియేట్‌ చేసిన యాంకర్‌ను కూడా చూశాం. డీప్‌ఫేక్‌ల విషయంలో టెక్నాలజీని నిందించడం తప్పు. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏఐని సృష్టించింది కూడా మనుషులే అనే విషయం గుర్తుంచుకోవాలి. టెక్నాలజీ అభివృద్ధి చూస్తుంటే.. భవిష్యత్తులో ఏఐ మన భాగస్వామి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు’ అని కృతి సనన్‌ అన్నారు.

అమిత్‌ జోషి, ఆరాధన సాప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గురించి కృతిససన్ చెబుతూ ‘తొలిసారి ఈ కథ విన్నప్పుడు ఇది కూడా ఒక అందమైన ప్రేమకథా చిత్రం. ఎలా ఉంటుందో. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా? అనే ఆలోచనే ఉండేది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుందనే అనుకున్నా.

కానీ ఎప్పుడైతే నా పాత్ర ఒక రోబో అని తెలిసిందో అప్పుడు ఆశ్చర్యపోయాను. సిఫ్రా అనే రోబో పాత్రలో నేను చేసిన అల్లరి ఒక రేంజ్‌లో ఉంటుంది‘ అని అన్నారు. ఇదే విషయంపై మరోనటి భూమి ఫెడ్నేకర్‌ కూడా మాట్లాడుతూ ‘ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. మన ఫొటోలు అలా చూసుకున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించుకోలేను. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే ప్రత్యేక చట్టాలు అమలు కావాలి’ అని అన్నారు.