Google Jobs: తెలుగు కుర్రాడికి గూగుల్‌లో రూ. కోటి ప్యాకేజీ

Google Jobs: పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని, కష్టపడితే గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లోనూ ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చని నిరూపించాడు పార్వతీపురం, మన్యం జిల్లాకు చెందిన బొద్దాన సంతోష్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తన నైపుణ్యంతో ఏకంగా రూ. 1 కోటి వార్షిక ప్యాకేజీతో గూగుల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపికై సత్తా చాటారు.

పాలకొండలోని వడమ కాలనీకి చెందిన కళ్యాణ్ ప్రసాద్, పార్వతి దంపతుల కుమారుడు సంతోష్. తండ్రి కళ్యాణ్ ప్రసాద్ స్థానికంగా ఒక చిన్న దుకాణం నిర్వహిస్తున్నారు. సంతోష్ తన పదో తరగతి, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలోనే చదవడం విశేషం.

2015లో రాజాంలోని జీఎంఆర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం డేటా సైంటిస్ట్ కోర్సులో ఎంటెక్ పట్టా పొందారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో తొలి ఐటీ ఉద్యోగం సాధించిన సంతోష్, ఆ తర్వాత ఎస్‌బీఐలో డేటా సైంటిస్ట్ విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా కూడా పనిచేశారు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో సంతోష్ ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేశారు. ప్రముఖ సంస్థ బోసెచ్ (Bosch) రీసెర్చ్ విభాగంలో పని చేస్తూ జర్మనీ, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల్లో తన ప్రాజెక్టులను ప్రెజెంట్ చేసి ‘ది బెస్ట్’ అవార్డులను అందుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్ ఉద్యోగం ఆఫర్ చేసినప్పటికీ, దానిని వదులుకుని గూగుల్ లక్ష్యంగా శ్రమించారు.

గూగుల్ డేటా స్ట్రక్చర్ విభాగంలో జరిగిన అత్యంత కఠినమైన 10 రౌండ్ల ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేశారు. గూగుల్ ఏఐ/ఎంఎల్ విభాగంలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా రూ. 1 కోటి ప్యాకేజీతో నియామకమయ్యారు.

సంతోష్ సాధించిన ఈ విజయంపై ఆయన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తన విజయానికి కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహమే కారణమని సంతోష్ తెలిపారు. ఏఐ రంగంలో పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకుంటే యువత అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన నిరూపించారు.

గతేడాది అన్నమయ్య జిల్లాకు చెందిన అదనుకోట యశ్వంత్ రూ. 2.5 కోట్ల ప్యాకేజీ సాధించగా, ఇప్పుడు మన్యం జిల్లా నుంచి సంతోష్ మరో మైలురాయిని చేరుకోవడం విశేషం.

Chillagattu Sreekanth Analysis On Constituencies increase in AP || Kutami || YCP || Jansena || TR