అసభ్యంగా తాకిన వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించా: నటి ఈషా డియోల్‌ స్వానుభవం!

వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు తప్పకుండా స్పందించాలని నటి ఈషా డియోల్‌ తెలిపారు. తాను ఒకానొక సమయంలో గుర్తు తెలియని వ్యక్తిని కొట్టానని చెప్పారు. ఓ సినిమా ఫంక్షన్‌లో అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2005లో తెరకెక్కిన ‘దాస్‌’ ప్రీమియర్‌ ఈవెంట్‌లో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పుణెలో ఈవెంట్‌ నిర్వహించారు. ప్రధాన నటీనటులతో కలిసి నేనూ ఆ కార్యక్రమానికి వెళ్లా. మమ్మల్ని చూసేందుకు జనాలు పెద్దఎత్తున వచ్చారు. చాలామంది బౌన్సర్ల మధ్య ఫంక్షన్‌ హాల్‌లోకి అడుగుపెడుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నన్ను అభ్యంతరకర రీతిలో తాకాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే, అతని చేయి పట్టుకొని గుంపులో నుంచి బయటకు లాగి.. చెంప చెళ్లుమనిపించా. అందరూ షాక్‌ అయ్యారు. సాధారణంగా నేను సరదాగా ఉండే వ్యక్తిని. ప్రతీ విషయాన్ని ఒక స్థాయి వరకూ అంగీకరిస్తా. నా సహనాన్ని పరీక్షిస్తూ ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే తప్పకుండా రియాక్ట్‌ అవుతా. నేనే కాదు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి మహిళా స్పందించాలి. శారీరకంగా పురుషులు బలవంతులు కావచ్చు. అంతమాత్రాన స్త్రీలను ఇబ్బందిపెట్టే హక్కు వారికి లేదు‘ అని ఈషా తెలిపారు.

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర, నటి హేమామాలిని దంపతుల కుమార్తెగా ఈషా డియోల్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘కుచ్‌ తో హై’, ‘యువ’, ‘ధూమ్‌’, ‘కాల్‌’, ’క్యాష్‌’, ‘హైజాక్‌’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు.