టాలీవుడ్ పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బిగ్ బ్యానర్

టాలీవుడ్ లో భారీ సినిమాలు చేయడానికి, రూ.వందల కోట్లు ఖర్చుపెట్టడానికి మన నిర్మాతలు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటి వరకు ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. అయితే, ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలను పక్కన పెట్టి, బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఇక్కడ పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడివారు గుర్తించేలోపే, చాపకింద నీరులా ఇక్కడ సెట్ అయిపోతున్నారు.

ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ తారలు, మన సినిమాల్లో నటించడం మొదలుపెడుతున్నారు. మరోవైపు మన హీరోల సినిమాలు బాలీవుడ్ నిర్మాతలు నిర్మించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్ కి ఉన్న క్రేజ్ ని వారు వాడుకోడం మొదలుపెట్టారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తో టీ-సిరీస్ ఆదిపురుష్ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కచ్చితంగా కాసుల వర్షం కురుస్తుందనే ధీమా ఉంది. కాగా, ప్రభాస్ అయిపోగానే టీసిరీస్ నిర్మాత భూషణ్ కుమార్ చూపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై పడింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. దానిని భూషణ్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు.

కేవలం మన హీరోల సినిమాలను నిర్మించడమే కాదు, మరో పెద్ద మాష్టర్ ప్లాన్ కూడా వేశారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఆఫీసు పెట్టడానికి కసరత్తులు మొదలుపెట్టారు. ఇప్పటికే హైదరాబాద్ లో 400 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారట. అక్కడ ఏడు అంతస్తుల భవనం నిర్మించబోతున్నారు. ఆ భవనం పూర్తైన వెంటనే, అక్కడ పూర్తిస్థాయిలో ఆఫీసు మొదలుపెట్టి, ఇక నుంచి తెలుగులో ఎక్కువ సినిమాబలు నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నారట.

అడపా,దడపా సినిమాలు చేయడం కాకుండా, టాలీవుడ్ హీరోలకు ఉన్న క్రేజ్ వాడుకొని వారు ఇక్కడ స్థిరపడాలని ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, టీ సిరీస్ నుంచి భారీ సినిమాలు రావడం మొదలైతే, మన నిర్మాతలు వెనకపడిపోయే అవకాశం ఉందనే కామెంట్స్ వినపడుతున్నాయి.