Balakrishna: ప్రగ్యా జైస్వాల్‌ను దబిడి దిబిడే అంటూ భయపెట్టిన బాలయ్య… అసలేమైందంటే?

Balakrishna: బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన చిత్రం అఖండ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో ప్రత్యేకించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య అద్భుతమైన నటనతో మరోసారి నందమూరి అభిమానులం అని ఫ్యాన్స్‌ చేత గర్వంగా చెప్పుకునేలా చేశారు. బోయపాటి- బాలయ్య కాంబినేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసినా అఖండ సినిమా మాత్రం మునుపెన్నడూ లేని విధంగా హిందూ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కళ్లకద్దినట్టు చూపించడంతో అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది.

ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ‘అఖండ’ 50 రోజులు పూర్తి చేసుకొని, అదే రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించబడి మరో ఘనత సాధించింది. అది ఓ రికార్డు అనుకుంటే.. ప్రస్తుతం ఈ సినిమా ఏకంగా సెంచరీ పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. తాజాగా ఈ సినిమా 20 థియేటర్స్‌లో 100 రోజుల పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.55 కోట్ల షేర్.. రూ. 106 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

బాలయ్య సినిమాలకు తెలంగాణలో కంటే రాయలసీమలో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీం కర్నూలులో ఓ కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. దాని కోసం చిత్ర బృందం అంతా కలిసి బస్సులో బయలుదేరిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలయ్య ప్రగ్యా జైస్వాల్‌ను పిలిచి, ప్రగ్యా ఇప్పుడే బాగా విశ్రాంతి తీసుకో.. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రాయలసీమ. అక్కడ జనం అభిమానాన్ని తట్టుకోలేవ్.. దబిడి దిబిడే అంటూ ఆమెను సరదాగా ఆటపట్టించారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ బాలయ్య చురుకుదనాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.