పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు భారత్లో తీవ్రంగా స్పందింపజేశాయి. భారత ప్రభుత్వంపై, సైన్యంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆఫ్రిదీకి బదులుగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. తాను స్పందిస్తూ ఆఫ్రిదీని “పెద్ద జోకర్” అని తీవ్రంగా విమర్శించారు.
ఆఫ్రిదీ మాట్లాడుతూ పహల్గాం ఘటనకు భారత్ సైన్యమే కారణమని, భారత్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్పై నింద వేస్తుందని ఆరోపించాడు. అలాగే భారత ప్రభుత్వం, ఆర్మీపై అసభ్యమైన విమర్శలు చేశాడు. అయితే ఆఫ్రిదీ వ్యాఖ్యలపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన స్పందన ఇచ్చారు. “అటువంటి పనికిరాని వాళ్ల గురించి మాట్లాడడం సమయం వృథా. ఆఫ్రిదీ పెద్ద జోకర్. అతడి మాటలు ఎలాంటి విలువ లేనివి. పాకిస్థాన్ మతం పేరుతో అమాయకులను చంపుతున్న దేశం. అలాంటి దేశపు మాజీ క్రికెటర్ నుంచి మంచి మాటలు రాగలవా?” అంటూ ఒవైసీ ధ్వజమెత్తారు.
కేవలం విమర్శలు మాత్రమే కాకుండా, అసదుద్దీన్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరారు. పాకిస్థాన్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని, సైబర్ దాడులు చేపట్టాలని, అవసరమైతే మిలిటరీ యాక్షన్ కూడా తీసుకోవాలని సూచించారు. పాక్ను ఆర్థికంగా బలహీనపరిచేలా పటిష్టమైన వ్యూహాలు అమలు చేయాలని ప్రధాని మోదీని కోరారు. “మతం పేరుతో అమాయకులను చంపితే ఏ దేశం అయినా గట్టిగా స్పందించాలి. భారత్ కూడా బలమైన చర్యలు తీసుకోవాలి,” అంటూ అసదుద్దీన్ పేర్కొన్నారు.