రూ.450 కోట్లతో మరో బిగ్ మల్టీస్టారర్

బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైన సంగతి తెలిసిందే. దీంతో బాహుబలి రేంజ్‌లో సినిమాను తెరకెక్కించడానికి బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ దర్శకులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఏదీ సరిగ్గా వర్కౌట్​ అవ్వలేదు. అయితే ఈ మధ్యలోనే కోలీవుడ్​లో భారీ బడ్జెట్​తో పొన్నియన్​ సెల్వన్​ రిలీజై ఆడియెన్స్​ను ఆక్టటుకుంది. కానీ అది బాహుబలి స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. అయితే పొన్నియల్​ సెల్వన్ కన్నా ముందే 2017లో బాహుబలి రేంజ్​లో దానికి పోటీగా తమిళంలో ఓ సినిమాను ప్రకటించారు. అదే ‘సంఘమిత్ర’.

తమిళంలో కళావతి, చంద్రకళ వంటి సూపర్​ హిట్​ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఏకంగా కేన్స్ ఇంట్రనేషనల్​​ ఫెస్టివల్​లో ప్రకటించారు. దీంతో అది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చిత్రంపై భారీ హైప్ క్రియేట్​ అయింది. ఇందులో జయం రవి, శ్రుతిహాసన్​, ఆర్య వంటి స్టార్లు నటించేందుకు సిద్ధమయ్యారు. శ్రుతిహాసన్ ఫస్ట్ లుక్​ కూడా విడుదలైంది. గుర్రంపై కత్తి పట్టుకుని యద్ధం చేస్తున్నట్లు కనిపించింది. దీని కోసం ఆమె బాగా శ్రమించింది కూడా. రోజు ఎంతో శిక్షణ కూడా తీసుకుంది. కానీ ఆ తర్వాత శ్రుతిహాసన్​ వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక ఆ తర్వాత చిత్రం కూడా కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆదిలోనే ఆగిపోయింది.

అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్​ను మళ్లీ సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్​. ఈ విషయాన్ని తమిళ సినీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో కొన్ని మార్పులు జరిగాయి. తాజా సమాచారాం ప్రకారం అప్పుడు రూ.150కోట్లతో నిర్మించాలనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఏకంగా రూ.450కోట్లతో రూపొందించబోతున్నారట. ఇందులో జయం రవి స్థానంలో విశాల్​ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి శ్రుతితో పాటు ఇతర తారాగాణం నటిస్తందో లేదో చూడాలి.

ఈ ఏడాది అక్టోబర్​లో రెగ్యులర్​ షూటింగ్ ప్రారంభించాలని సుందర్​ సి యోచిస్తున్నారట. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తున్నారట. అందరితో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే దీని మళ్లీ అధికారికంగా ప్రకటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్​ అని గతంలో కూడా చెప్పారు. “సంఘమిత్ర రెండు భాగాలుగా రాబోతుంది. మొదట క్లైమాక్స్​ సన్నివేశాలను సముద్రంలో తెరకెక్కిస్తారు. ఇండియాలో భారీ సినిమాగా రూపొందుతుంది. అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఈ ఏడాది మధ్యలో తెలియజేస్తారు” అని తమిళ సినీవర్గాలు తెలిపాయి.