ఆదిపురుష్… రామయాణం కాదంటున్నారు!

పాన్ ఇండియా ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం జూన్ 16 న శుక్రవారం థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాఘవడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. సుమారు రూ.550 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.

అయితే ఈ సినిమా రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కినట్లు మొదటి నుంచి చెప్పారు. ఎన్ని రామాయణం సినిమాలు వచ్చినా సూపర్ హిట్టే. అయితే మరోసారి రామాయణం చూడండి అంటూ ప్రమోట్ చేశారు. సినిమా రిలీజ్ వరకు ఈ సినిమాను రామాయణ గాథగానే చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై పలు విమర్శలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా రామయాణం కాదంటూ మాట మర్చారు ఈ చిత్ర రైటర్. దీనితో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆదిపురుష్ ర‌చ‌యితల్లో ఒక‌రైన మ‌నోజ్ ముంతాషిర్ శుక్లా.. ఓ టీవీ ఛానల్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. అందులో ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆది పురుష్ సినిమాపై పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్ మీద దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. వీటిపై రచయిత మనోజ్ స్పందించారు.

మనోజ్ మాట్లాడుతూ… నేను రామాయ‌ణం నుంచి చాలా వ‌ర‌కు స్ఫూర్తి పొందిన మాట వాస్త‌వ‌మే. మేము తీసింది మాత్రం రామాయ‌ణ క‌థ‌ను కాదు… ఇది క‌ల్పిత క‌థ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రామాయణం కథ అంటూ ప్రచారం చేసి… అందులోనూ హనుమంతుడి సీట్ అంటూ.. తమ మనోభావాలతో ఆడుకున్నారని నెటిజన్స్ అంటున్నారు. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే.. విడుదల అయిన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. అయినప్పటికీ మొదటి రోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇక ఆదిపురుష్ ను టీ సిరిస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మించాయి.