నాలుగు సెంచరీలతో ప్రభాస్ సంచలన రికార్డు

ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఓం రౌత్ అనే స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రామాయణం నేపథ్యంతో చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్టుతో రూపొందిన విషయం తెలిసిందే.

విజువల్ వండర్‌గా రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ మూవీని జూన్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే మే 9వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా గ్రాఫిక్స్‌తో డిజైన్ చేశారు.

‘ఆదిపురుష్’ ట్రైలర్‌కు ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరి నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో వ్యూస్, లైకులు దక్కాయి. ఇలా 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలుపుకుని ఈ సినిమా ట్రైలర్‌కు 74.02 మిలియన్ వ్యూస్‌ను సొంతం అయ్యాయి. అలాగే దీనికి 2.11 మిలియన్ లైకులూ వచ్చాయి.

విడుదలైనప్పటి నుంచే అత్యధిక స్పందనను అందుకుంటూ దూసుకుపోతోన్న ‘ఆదిపురుష్’ ట్రైలర్‌ తాజాగా అన్ని భాషల్లో కలుపుకుని వంద మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ మార్కును చేరుకుని మరో రికార్డును క్రియేట్ చేసింది. దీంతో ప్రభాస్ ఖాతాలో మరో వంద మిలియన్ వ్యూస్ ఉన్న ట్రైలర్ కూడా వచ్చి చేరినట్లు అయింది.

ఇదిలా ఉండగా.. గతంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్’ మూవీల ట్రైలర్లు కూడా వంద మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ‘ఆదిపురుష్’ కూడా ఆ మార్కును చేరుకుంది. దీంతో వరుసగా నాలుగు వంద మిలియన్ వ్యూస్‌ ట్రైలర్లు ఉన్న ఏకైక హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంటర్నేషనల్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. దీనిపై అతడి ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతోన్నారు.