యూవీ క్రియేషన్స్.. మారేలా లేరు?

ప్రభాస్ మిర్చి సినిమాతో ప్రొడక్షన్ హౌస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన యూపీ క్రియేషన్స్ ఆ తర్వాత వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంది. ఒకవైపు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రభాస్ సపోర్ట్ తో కూడా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను నిర్మించింది. సాహో, రాధే శ్యామ్.. రెండు సినిమాలను కూడా గ్రాండ్ గానే నిర్మించారు.

కానీ ఆ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేకపోయాయి. ముఖ్యంగా రాధే శ్యామ్ దారుణంగా డిజాస్టర్ అయింది. అయితే నిజానికి సినిమా విడుదల కంటే ముందే ప్రమోషన్స్ విషయంలో యూవీ క్రియేషన్స్ పెద్దగా ప్రణాళికతో లేకపోవడం కూడా మైనస్ అవుతుంది. ఇప్పుడు అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమాలకు కూడా అదే సమస్యగా మారింది.

వీరి కలయికలో వస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ గత ఏడాది నుంచి ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. నవీన్ పోలీస్ శెట్టి కూడా పలు కాలేజీలలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేశాడు.

ఇంకా అనుష్క మాత్రం రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. అయితే సినిమా విడుదలవుతున్న తరుణంలో మళ్ళీ UV క్రియేషన్స్ అనుకున్న డేట్ ను మార్చి ఆగస్టు 18 కి సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో అనుష్క అభిమానులు యూవీ క్రియేషన్స్ పై మరోసారి మండిపడుతున్నారు. మీరు ఇంకా మారరా.. గతంలో ప్రభాస్ సినిమాల విషయంలో కూడా ఇలానే చేశారని అంటూ ట్రోలింగ్ అయితే మళ్లీ మొదలు పెట్టేస్తున్నారు.