సస్పెన్స్: ‘మహర్షి’స్పెషల్ గెస్ట్ ఎవరో

సూపర్‌స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల సమక్షంలో సాయంత్రం 6 గంటల నుండి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ జరగనుంది. ఈ వేడుకలో ఓ స్పెషల్ గెస్ట్ హాజరుకాబోతున్నారట. ఆ గెస్ట్ ఎవరు అన్నది యూనిట్ సస్పెన్స్ లో పెట్టింది.

మహేష్ బాబుకు ఉన్న స్నేహితుల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. భరత్ అనే నేను వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎల్బీ స్టేడియంలో వేడుక జరిగింది. మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే, మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ వస్తారని టాక్ వినిపిస్తోంది. చరణ్ తో పాటు ఎన్టీఆర్ ను కూడా ఈ వేడుకకు పిలుస్తున్నారని సమాచారం. దాంతో ఇండస్ట్రీలో టాప్ హీరోలు ముగ్గురిని ఒకే వేదికపై చూడొచ్చని అభిమానులు ఆశపడుతున్నారు.

వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. మహేశ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.