‘సాహో’ కొత్త పోస్టర్ : ఆ సినిమా గుర్తొస్తోందేంటి?

ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ‘సాహో’ . సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. తెలుగు,తమిళ, హిందీ , మళయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు.

అందులో భాగంగా కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేస్తోంది టీమ్. తాజాగా ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ చూడగానే ..బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం థూమ్ గుర్తు వస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినవస్తున్నాయి.

మొన్నటి పోస్టర్‌లో కళ్లద్దాలు పెట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపించిన ప్రభాస్..ఇప్పుడీ కొత్త పోస్టర్‌లో బైక్‌పై రయ్ రయ్ మంటూ వెళ్లిపోతున్నారు. బాలీవుడ్‌లో వ‌చ్చిన థూమ్ సిరీస్ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఓ కాకలు తీరిన దొంగ‌… వాడ్ని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు చేసే ప్ర‌య‌త్నాలు.. వెరిసి యాక్ష‌న్ ప్రియుల‌కు మంచి కిక్ ఇచ్చాయి. డేట్‌, టైమ్‌, ప్లేస్ చెప్పి దొంగ‌త‌నాలు చేయ‌డం ధూమ్‌ స్పెషాలిటీ. దాదాపు ఇలాంటి కథతోనే ప్రభాస్ సాహో చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.